Saturday, September 11, 2010

TEJA MENNENI: WE MUST BE THE CHANGE!!

సృష్టిలో ప్రతీది మార్పు చెందేదే. అది నిరంతర ప్రక్రియ. మార్పువలన మంచీ, చెడూ రెండూ సంభవిస్తాయి. ఒకే మార్పు ఒకరికి మంచిగా, మరొకరికి చెడుగానూ మారవచ్చు. అందుకే మార్పును చూసి భయపడకూడదు. మంచి అయినా, చెడు అయినా మార్పును అనుకూలంగా మలచుకోవడంలోనే మనుషుల విజ్ఞత ద్యోతకమవుతుంది.

హోరుమని వర్షం కురుస్తోంది. ఆ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ దారిలో ప్రయాణించే రైలు ఒక చిన్న గ్రామంలో ఆగిపోయింది. ఎప్పుడు కదులుతుందో తెలియని పరిస్థితి. ఒక బాల బిచ్చగాడు అది చూశాడు. ప్రయాణీకుల దగ్గర అడుక్కోవాలని వెళ్ళాడు. అక్కడి ప్రయాణీకుల పరిస్థితి మరోలాగ ఉంది. ఎంత డబ్బున్నా తినడానికి ఏదీ దొరకని పరిస్థితి వారిది. పిల్లలు మరీ తల్లడిల్లిపోతున్నారు.ఆ స్థితిలో అడిగితే ఛీత్కారాలు తప్ప చిల్లర రాలదు. అయినా డబ్బు సంపాదించాలి. ఎలా?... ఆలోచించాడు. అంతవరకూ బిచ్చమెత్తగా వచ్చిన డబ్బులు లెక్కచూసుకున్నాడు. పచారీ కొట్టుకు వెళ్ళి సామానులు కొన్నాడు. ఇంటికి వెళ్లి తల్లిచేత సులువుగా తయారయ్యే తినుబండారాలు తయారుచేయించాడు. రైలు ఆగిన ప్రదేశానికి చేరుకున్నాడు. వాటికి గిరాకీ పెరిగింది. డబ్బూ వచ్చింది. అదే పెట్టుబడిగా రెండుమూడు సార్లు అలాగే చేశాడు. రైలు వెళ్ళిపోయాక లెక్కచూసుకుంటే... ఆశ్చర్యం. ఒక్కరోజులోనే ఎంతో మార్పు. ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో అతడి జీవితమే మారిపోయింది. బిచ్చగాడినుంచి వ్యాపారిగా అతడి హోదా పెరిగింది.

'మార్పే ప్రపంచానికి మూలసూత్రం. మారనిదే ప్రపంచం మనజాలదు' అంటాడు గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్‌. అతడి సిద్ధాంతం ప్రకారం విశ్వంలో ఏదీ ఏ క్షణమూ స్థిరంగా ఉండదు. మార్పుచెందని పదార్థమూ ఉండదు. కిందటి క్షణానికి, ఈ క్షణానికి మధ్య ఈ విశ్వంలో జరిగే మార్పువలన ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరగవచ్చు. నిరంతరమైన ఈ మార్పే చైతన్యం. చైతన్యం ప్రకృతిస్వరూపం. ప్రకృతి పంచ భూతాత్మకం. అందుకే పంచ భూతాలూ నిరంతరం అనేక మార్పులు చెందుతూ ఉంటాయి.

భూమి అనేకదేహాలుగా (పశు, పక్షి, వృక్షాదులు), నీరు అనేకరూపాలుగా (ఆవిరి, బిందువు, సింధువు, ఘనం), అగ్ని ఒక శక్తిగా (నడిపించే, నశింపజేసే), వాయువు ప్రాణరూపంగా, ఆకాశం అవకాశాలకు నిలయంగా మార్పు చెందుతూనే ఉంటాయి. పదార్థం, పరిస్థితులు, ఆలోచనలు, అలవాట్లు, ప్రకృతి, నాగరికతలాంటివన్నీ నిరంతరం మార్పుచెందేవే. ప్రవహించే నీటికి ఆటంకం ఏర్పడితే అక్కడితో ఆగిపోదు. దారి మార్చుకుని పక్కదారులగుండా మరలిపోతుంది. అల్పప్రాణులు సైతం వాటికనుగుణంగా తమ అలవాట్లను మలచుకుంటాయి. ముందుజాగ్రత్తలు తీసుకుంటాయి. వలసపోవడం (పక్షులు), భూమి అడుగుపొరలలోకి చేరిపోవడం (వేసవిలో చేపలు), దీర్ఘనిద్రలోకి వెళ్ళిపోవడం (మంచు ప్రాంతాల్లో ప్రాణులు)లాంటివి చేస్తుంటాయి. ప్రకృతి తనకు ఇవ్వని శక్తిని తలచుకుని కుమిలిపోకూడదు. అలాటి పరిస్థితులను అధిగమించడానికే తెలివినిచ్చాడు భగవంతుడు. దాని సాయంతో ఇతరులకున్న అవకాశాల్ని తనకు అనుకూలంగా మలచుకోవాలి. కోయిలకు తన గుడ్లను పొదగడం తెలియదు. అందువలన కాకి గూటిలో గుడ్లు పెడుతుంది. అంగవైకల్యం కలిగినవారు సైతం తమ వైకల్యానికి కుంగిపోరు. తమకున్న ఇతర శక్తులను ఆ వైకల్యానికి విరుగుడుగా మార్చుకుంటారు.

నవనవలాడే పదార్థం కాలానుగుణంగా కుళ్ళిపోతుంది. అది ఎరువుగా మారి తనలోని సూక్ష్మపదార్థాలతో, మరో పదార్థానికి రూపునిస్తుంది. పర్వతం అ(క)రిగిపోయి ఇసకరేణువులుగా మారినా, అది మరో భవన నిర్మాణానికి ముడిపదార్థంగా మారుతుంది.

కష్టాన్ని అనుభవంగా, అపజయాన్ని గుణపాఠంగా, అవమానాన్ని ఎత్తుకు ఎదిగే ఆసరాగా, ఆపదల్ని సంపదలుగా మార్చుకోవాలి. అదే తెలివైన వారి లక్షణం. జన్మరాహిత్యమైన మోక్షం పొందాలన్నా మార్పువలననే సాధ్యం. సంసారి ధ్యానిగా, ధ్యాని యోగిగా, యోగి సన్యాసిగా మారుతూ, చివరికి ఏ మార్పూలేని పరమాత్మను చేరుకోవచ్చు!

TEJA MENNENI: ART OF LIVING

ఆనంద పరీమళం

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌
ఏ ఒక్కరి జీవితమూ పుడుతూనే పూలబాటకాదు. ధనం ఉన్నా లేకున్నా విద్య ఉన్నా లేకున్నా రూపం ఉన్నా లేకున్నా ఏ స్థితిలోనైనా ఆ స్థితికి తగిన ఇబ్బందులు అవి తెచ్చే దుఃఖాలూ ఎంతో సహజాతిసహజం. మానవుడు పుడుతూ ఏదీ నేర్చుకోడు. అన్నీ పెరుగుతూనే నేర్చుకొంటాడు. ఈ క్రమంలో అలా నేర్చుకొనే వాటిలో ఏవి ఆనందాన్నిస్తాయో ఏవి దుఃఖాన్నిస్తాయో తెలుసుకోలేక తికమకపడి సరిగ్గా కష్టాల్ని కొనితెచ్చిపెట్టే అలవాట్లను ఇష్టంగానూ, నిత్యానందాన్ని అందించే అలవాట్లని కష్టంగానూ భావిస్తాడు. కొన్ని ఉదాహరణల్ని చూస్తే ఈ విషయంలోని లోతు ఇట్టే అర్థమవుతుంది.

ఎవరైనా సరే నిత్యం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి?
మనల్ని నిత్యం కలవరపెట్టే విషయాలనుంచి దూరంగా ఉండటం మంచిది.
1. ఎప్పుడూ ఎవరినీ ద్వేషించకుండా ఉండాలి.
2. ఎప్పుడూ మనసును ఆందోళనలకు దూరంగా ఉంచాలి. కంగారు పడకూడదు.
3. నిరాడంబర జీవనం సాగించాలి.
4. తక్కువ ఆశించాలి.
5. ఎక్కువ త్యాగం చేయాలి.
6. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
7. తీరిక సమయాల్లో- నచ్చిన, నమ్మిన భగవన్నామస్మరణ చేయాలి.

ఈ ఏడు అలవాట్లు పైకి మామూలుగా కనిపించినా, ఎప్పుడూ ఎవరికీ నిత్యంగా లభించని ఆనందాన్ని పట్టితెచ్చి మన అరచేతిలో ఉంచుతాయి. ఎందుకంటే, ఎప్పుడైనా మనం అదుపు తప్పేది ఒకరిపై ద్వేషం పుట్టినప్పుడే. ఎవరేం చేసినా నేను ఎవరినీ ద్వేషించనని ముందే మనసులో మనం ఒక స్థిర నిర్ణయానికి వస్తే- ద్వేషంవల్ల వచ్చే ప్రతీకార వాంఛ, క్రోధం వంటి దుర్గుణాల్ని నిరోధించవచ్చు. ద్వేషాన్ని రూపుమాపుకొన్నవాడే తన ప్రియభక్తుడని కృష్ణభగవానుడే చెప్పాడు. ఇక ఆందోళనలకు కారణం మనస్సు. మానవుని బంధనానికిగానీ, జీవన్విముక్తికిగానీ కారణం మనసే. ఆ మనసు అతి చంచలమైనది. సత్కర్మాచరణ, ధార్మికనిష్ఠ సత్కథాకాలక్షేపాల వంటి నియమిత కర్మలను నిరంతరంగా ఆచరించడం ద్వారా మనసు తాలూకు వక్రబుద్ధిని సరిచేసుకోవచ్చు. ఆడంబరాలు మనసును కలుషితం చేస్తాయి. జగత్తులో సర్వమూ మిథ్య అనే వేదాంతం ఆడంబరాల్ని రూపుమాపుతుంది. దర్పం, అహంకారం వంటి దుర్గుణాలకు గొడ్డలిపెట్టు నిరాడంబరత్వం. ఆశ మనల్ని దాసుల్ని చేసి ఆడిస్తుంది. సాధ్యమైనంత తక్కువ ఆశించాలి. మనం దేన్నైనా ఆశించడం మొదలుపెట్టామా? దుఃఖంలోనికి దిగుతున్నట్లే లెక్క. ఆశించినదే ఎల్లప్పుడూ దక్కదు కదా! అప్పుడు దుఃఖమూ తప్పదు. అందుకే మొదటినుంచీ పుచ్చుకోవడంలోకన్నా ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉందనే భావనను అలవరచుకోవాలి. ఒక్కసారి ఆ ఆనందంలోని మాధుర్యం చవిచూస్తే ఎప్పుడూ మనసు 'ఆశ' జోలికిపోదు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. హృదయం నిర్మలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం. సాధ్యమైనంత వరకూ హృదయహాసాన్ని నిత్యం ధరిస్తే, ఆ హాస్యం ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ మనోల్లాసమే ఇతరుల హృదయ వికాసానికి దోహదం చేస్తుంది. ఈ లక్షణాలన్నీ సాధించాలంటే మానవుని మానవునిగా చూస్తే సరిపోదు. ప్రతి జీవిలోనూ దివ్యత్వం, దైవత్వం ఉన్నట్లు భావించాలి. సృష్టిలో ఏ ప్రాణిని చూసినా దైవస్వరూపంగా తలపోయాలి. అప్పుడే నిత్యానందం కరతలామలకమవుతుంది. ప్రయత్నపూర్వకంగా సాధించిన ఈ ఆధ్యాత్మిక సుమ పరీమళం లోకమంతా వ్యాపించి ఆనందం అందరికీ అందుతుంది.